చెరువు దగ్గర కనిపించిన అమ్మాయి – Part 2 1980ల్లో… ఒక చిన్న గ్రామంలో జరిగిన సంఘటనను ఇప్పటికీ అక్కడి పెద్దవాళ్లు పూర్తిగా మర్చిపోలేదు… పౌర్ణమి రాత్రి చెరువు దగ్గరకు వెళ్లిన వాళ్లు ఎందుకు తిరిగి ఆ దారి వైపు చూడకుండా వచ్చేవారు…? అసలు… “లక్ష్మి” అనే ఆ అమ్మాయి నిజంగా ఎవరు…? ఆ రాత్రి… రాఘవ చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి. అతని అరచేతుల్లో ఇంకా చెరువు నీటి చల్లదనం మిగిలి ఉన్నట్టే అనిపిస్తోంది. అతని చేతిలో ఉన్న ఆ వెండి గాజు మాత్రం చంద్రకాంతి తగిలినప్పుడల్లా వింతగా మెరుస్తోంది. అది సాధారణ గాజులా కనిపించినా… దానిలో ఏదో చెప్పలేని భయం దాగి ఉన్నట్టుగా ఉంది. ఇంట్లో అందరూ నిద్రపోయారు. బయట అప్పుడప్పుడు వీచే గాలి పాత కిటికీ తలుపులను మెల్లగా కదిలిస్తోంది. దూరంగా ఎక్కడో కుక్కలు మొరుగుతున్న శబ్దం మాత్రమే ఆ నిశ్శబ్ద రాత్రిని చీల్చుతోంది. కానీ రాఘవకు మాత్రం కళ్లకు నిద్ర రాలేదు. అతను మంచం మీద పడుకున్నప్పుడల్లా చెరువు దగ్గర కనిపించిన ఆ అమ్మాయి ముఖమే గుర్తొస్తోంది. ఆమె కళ్ళలో కనిపించిన ఆ విచిత్రమైన బాధ… ఆమె మాటల్లో దాగి ఉన్న ఆ ఒంటరితనం… ఏదో అతని మనసును గట్టిగా పట్టేసినట్టుంది. ఆ అమ్మాయి చెప్పిన మాటలు ఇంకా అత...
ఉమ్మడి కుటుంబం – Episode 3
1980లో…
ఒక చిన్న పల్లెలో ఉన్న ఉమ్మడి కుటుంబం.
మధ్యాహ్నపు ప్రశాంతత…
కుటుంబంతో కలిసి భోజనం…
చిన్నారి శారద అల్లరి…
కానీ…
ఆ ప్రశాంతమైన రోజుల్లోనే నెమ్మదిగా ఒక మార్పు మొదలవుతోంది… 👇
మధ్యాహ్నపు ఎండ నెమ్మదిగా ఊరంతా పరుచుకుంది.
ఇళ్ల ముందు వేసిన మగ్గాలపై ఆరేసిన బట్టలు గాలికి మెల్లగా ఊగుతున్నాయి.
దూరంగా ఎక్కడో ఎద్దుల బండి చక్రాల శబ్దం వినిపిస్తోంది.
సుమతి ఇంటి ముందు నిలబడి,
“శారదా… రామ్మా తల్లి… అన్నం చల్లారిపోతుంది…” అంటూ మళ్లీ పిలిచింది.
పిల్లలతో ఆడుకుంటున్న శారద,
“వస్తున్నా అమ్మా…” అంటూ పరుగెత్తుకుంటూ వచ్చింది.
పాదాలన్నీ మట్టితో నిండిపోయి ఉన్నాయి. అది చూసి సుమతి,
“అయ్యో… నిన్ను చూస్తే పిల్లలా ఉన్నావో లేక మట్టిబొమ్మలా ఉన్నావో అర్థం కావట్లేదు!” అంది.
శారద చిన్నగా నవ్వేసింది.
ఇంట్లోకి వెళ్లగానే రాములమ్మ అప్పటికే పళ్లెంలు తీసి వరుసగా పెట్టింది.
ఆ రోజుల్లో భోజనం అంటే అందరూ కలిసి కూర్చుని తినడం తప్పనిసరి.
ముందు ఇంటి పెద్దవాళ్లు…
తర్వాత పిల్లలు…
చివరగా ఆడవాళ్లు తినేవారు.
సుమతి మావయ్య సిద్దయ్య ఇంకా రాఘవుడు ఇద్దరూ పొలం నుంచి భోజనానికి అని కొద్దిసేపు ఇంటికి వచ్చారు.
"నాన్నా... తాతయ్యా..." అంటూ వాళ్ళ దగ్గరకు పరిగెత్తింది శారద.
అంతలో తాతయ్య చేతులు, కాళ్ళు కడుక్కుని "రామ్మా నా చిట్టి తల్లి" అంటూ శారదను ఎత్తుకున్నాడు.
రాఘవుడు కూడా చేతులు, కాళ్ళు కడుక్కుంటూ,
“ఈరోజు ఎండ ఎక్కువగా ఉంది…” అన్నాడు.
రాములమ్మ వెంటనే,
“వానలు బాగానే పడ్డాయి కానీ ఎండ కూడా అలాగే ఉంది ఈసారి…” అంది.
భోజనానికి సుమతి తప్ప ఇంక అందరూ కూర్చున్నారు.
సుమతి ఒక గిన్నెలో వేడి అన్నం ఇంకా పప్పు తెచ్చి అందరికీ వడ్డించింది.
శారదకు ఒక చిన్న గిన్నెలో అన్నం పప్పు కలిపి ఇచ్చింది. అందరూ మాట్లాడుతూ తింటిన్నారు.
సుమతి నించోని ఎవరికి ఏమి వడ్డించాలి అని గమనిస్తూ ఉంది.
శారద మాత్రం తినడం కంటే మాట్లాడటంలోనే బిజీగా ఉంది.
“నాన్నా… నేను ఈరోజు పెద్ద కుండతో కూడా నీళ్లు తెస్తా!” అంది.
అది విని అందరూ నవ్వారు.
“ముందు నీ చిన్న కుండను సరిగ్గా మోయడం నేర్చుకోమ్మా…” అన్నాడు రాఘవుడు సరదాగా.
సుమతి మావయ్య సిద్దయ్యకు ఇంకొంచం పెరుగుకు అన్నం పెట్టడానికి ముందుకు వచ్చేసరికి.
“చాలమ్మా… కడుపు నిండిపోయింది…” అంటూ సిద్దయ్య చేతులు కడుక్కున్నాడు.
పక్కనే కూర్చున్న రాములమ్మ:
“రోజంతా పొలంలో పని చేసి వచ్చి ఇదేంటండీ… ఇంత తక్కువగా తింటే ఎలా?” అంటూ మందలించినట్టు అంది.
సిద్దయ్య మెల్లగా నవ్వి,
“పాత వయసయ్యింది రాములమ్మ… ముందు లాగా కడుపు కూడా వినడం లేదు…” అన్నాడు.
ఆ మాట విన్న శారద వెంటనే తాతయ్య దగ్గరకు వచ్చి,
“అయితే నా అన్నం తింటావా తాతయ్య?” అంటూ తన చిన్న గిన్నెను ముందుకు చాపింది.
అందరూ ఒక్కసారిగా నవ్వేశారు.
సిద్దయ్య శారద తల నిమిరి,
“నీ అన్నం తింటే నాకు మళ్లీ బలం వచ్చేస్తుందేమో!” అన్నాడు.
శారదకి అది నిజంగానే అనిపించింది.
“అయితే తిను…” అంటూ గిన్నె అతని చేతిలో పెట్టింది.
ఆ చిన్న మాటకి ఆ ఇంటి వాతావరణం ఇంకా హాయిగా మారిపోయింది.
రాఘవుడు మాత్రం ఇంకా నెమ్మదిగా తింటూ,
“రేపు పొలం పక్కనున్న కాలువ కట్ట కొంచెం బలపరచాలి.
ఈసారి నీళ్లు ఎక్కువగా వస్తున్నాయి…” అన్నాడు.
సిద్దయ్య వెంటనే,
“అవునురా… నిన్న రాత్రి కూడా నీళ్లు గట్టిగా వచ్చాయి. జాగ్రత్తగా చూడాలి.
ఒకవేళ కట్ట తెగితే పంట అంతా నీళ్లలో పోతుంది…”
అన్నాడు.
ఆ మాటలు వింటూ సుమతి కాసేపు ఆగింది.
ఆ కాలువ వాళ్ల కుటుంబానికి ఎంత ముఖ్యమో ఆమెకు బాగా తెలుసు.
ఆ నీళ్లపైనే పంట…
ఆ పంటపైనే ఇంటి జీవితం.
రాములమ్మ పెరుగు కలుపుకుంటూ,
“ఈసారి పంట బాగుంటే శారదకి కొత్త పట్టు లంగా కుట్టించాలి…” అంది.
అది విన్న వెంటనే శారద కళ్లు మెరిశాయి.
“ఎర్ర రంగు కావాలి నాకు!” అంటూ ఆనందంగా అరిచింది.
“ప్రతి సారి నీకు ఎర్రదే కావాలి…” అంటూ రాఘవుడు నవ్వాడు.
“ఎందుకంటే… ఎర్ర రంగు వేసుకుంటే నేను సినిమా వాళ్లలా ఉంటానట!” అని శారద అమాయకంగా చెప్పేసరికి మళ్లీ అందరూ నవ్వేశారు.
అలా ఒక్కొక్కరిదీ భోజనం అయ్యాక…
ఇంట్లో పెద్దవాళ్లు కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడానికి లోపలికి వెళ్లారు.
ఆ కాలంలో మధ్యాహ్నం వేళల్లో ఊరంతా చాలా ప్రశాంతంగా ఉండేది.
చెట్ల కింద ముసలివాళ్లు కూర్చుని ఊరి విషయాలు మాట్లాడుకునేవారు.
రాఘవుడు తిన్న తర్వాత చేయి కడుక్కుని అలాగే కూర్చొన్నాడు...
"నాది కూడా అయిపోయింది" అంటూ తన ఖాళీ గిన్నెను చూపించింది శారద.
సుమతి శారద చేతులు ఇంకా తన మూతి కడుగుతుంటే
"ఇక చాలమ్మా" అని తాతయ్య దగ్గరకు పరిగెత్తింది.
కొంచం సేపటికి...
"సాయంత్రం వర్షం పడేలా ఉంది... నేను వెళ్లి కట్ట బలపరుస్తాను" అని మళ్ళీ పొలానికి బయలుదేరాడు రాఘవుడు.
తర్వాత...
సుమతి రాఘవుడు తిన్న పళ్లెంలోనే కొంచం అన్నం పప్పు వేసుకుని తినింది.
ఆమె తిన్న తర్వాత పాత్రలు అన్నింటిని శుభ్రపరిచింది.
"శారదా ఎక్కడున్నావమ్మా కొంచం సేపు పడుకొందువు రామ్మా తల్లి" అని శారదను ప్రేమగా పిలిచింది.
శారద వాళ్ళ తాతయ్యతో మాట్లాడుతూ ఉండగా...
తనకు అమ్మ పిలుపు వినపడింది. ఆ పిలుపు విన్న వెంటనే
"వస్తున్నా అమ్మా" అంటూ వచ్చింది.
సుమతి శారదకు ఒక పాట పడుతూ నిద్రపుచ్చింది.
శారద పడుకొన్న తర్వాత మెల్లగా బయటకు వచ్చి ఇంటి ముందర చిన్న పీట వేసుకుని ముందు పెద్ద గిన్నెలో బియ్యం పోసుకుని రాళ్లు ఏరడం మొదలుపెట్టింది.
ఆడవాళ్లు మధ్యాహ్నం ఇంటి పనులంతా అయినా తర్వాత...
ఇంటి ముందు కూర్చుని బియ్యం ఏరడం, పప్పులు శుభ్రం చేయడం చేసేవారు.
శారద కొంచం సేపటికి నిద్ర లేచేసింది.
"అమ్మా..." అంటూ వచ్చింది.
సుమతి "అప్పుడే లేచేసావా... ఇంకొంచం సేపు పడుకోకుండా" అంది.
శారద అమ్మ దగ్గరికి వచ్చి సుమతి పక్కనే కూర్చుని,
“అమ్మా… నేనూ చేస్తా…” అంది.
“నీ చేత్తో చేస్తే అన్నంలో రాళ్లకంటే మట్టే ఎక్కువ పడుతుంది!” అంటూ సుమతి మెల్లగా నవ్వింది.
అయినా శారద చిన్న చేతులతో బియ్యం కలుపుతున్నట్టు నటించింది.
ఇంతలో ఊరి దారిలోంచి ఒక శబ్దం వినిపించింది.
“చీరలు… కొత్త చీరలు…” అంటూ ఒక వ్యాపారి ఊర్లోకి వచ్చాడు.
ఆ రోజుల్లో ఇలా ఊరూరా తిరుగుతూ వస్తువులు అమ్మేవాళ్లు... తరచూ వచ్చేవారు.
వెంటనే వీధిలో ఉన్న ఆడవాళ్లు ఒక్కొక్కరిగా బయటికి వచ్చారు.
సుమతి కూడా బియ్యం అంతా లోపల పెట్టి చీరలు చూడటానికి వెళ్ళింది.
రంగురంగుల చీరలు చూసి మాట్లాడుకుంటున్నారు.
సుమతి కూడా కాసేపు వెళ్లి చూసింది.
ఒక ఆకుపచ్చ చీరను చేతిలో పట్టుకుని చూస్తుండగా…
రాములమ్మ దగ్గరికి వచ్చి,
“పండుగ దగ్గరపడుతోంది కదా… ఒకటి తీసుకోమ్మా…” అంది.
సుమతి మాత్రం,
“ఇంకోసారి తీసుకుంటా అమ్మా… ముందుగా అప్పులు కొంచెం తగ్గాలి…” అంది మెల్లగా.
ఆ మాట విన్న రాములమ్మ కాసేపు మౌనంగా నిలబడి ఉంది.
ఆ రోజులలో చాలా కుటుంబాల పరిస్థితి అలానే ఉండేది.
కష్టపడి పని చేసినా…
డబ్బు మాత్రం చేతిలో నిలబడేది కాదు.
సుమతి ఇంకా వాళ్ళ అత్తయ్య ఇద్దరూ కొంచం బాధతోనే తిరిగి ఇంటికి వెళ్లిపోయారు.
కానీ…
ఆ సాయంత్రం కాలువ దగ్గర జరిగిన ఒక చిన్న సంఘటన…
ఆ ఇంటి ప్రశాంతతను నెమ్మదిగా మార్చబోతుందని అప్పుడెవరూ ఊహించలేదు…
ఆ సాయంత్రం కాలువ దగ్గర జరిగిన ఒక చిన్న సంఘటన…
ఆ ఇంటి ప్రశాంతతను నెమ్మదిగా మార్చబోతుందని అప్పుడెవరూ ఊహించలేదు…




Comments
Post a Comment