ధార్మిక ఎవరు..?
ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న, ప్రకృతి సోయగాలతో నిండిన గ్రామంలో ‘ధార్మిక’ అనే ఒక యువతి జీవించేది. ఆమె ఈ గ్రామానికి ఎలా వచ్చింది అనేది మాత్రం ఎవరికీ పూర్తిగా తెలియదు కానీ అందరూ ఇలా చెబుతుంటారు.
ఒక రాత్రి భారీ వర్షం పడినప్పుడు, ఉరుములు-మెరుపులు ఆకాశం దద్దరిల్లెలాంటి శబ్దం వస్తున్న సమయంలో గ్రామం చివర ఉన్న పెద్ద వేపచెట్టు కింద ఒక చిన్న పాప ఏడుస్తూ కనిపించింది. ఆ పాపను మొదటిసారి చూసింది అదే గ్రామంలోని నివసిస్తున్న ఒక ముసలమ్మ.
“ఈ సమయంలో ఇక్కడ ఈ పాప ఎలా వచ్చింది?” అని ఆశ్చర్యపోయింది. ఆమె దగ్గరికి వెళ్లి చూస్తే… ఆ పాప ముఖం మీద ఒక విచిత్రమైన ప్రశాంతత, కళ్లలో ఓ వెలుగు కనిపించాయి. "ఇంత చీకటిలో, ఇంత భారీ వర్షంలో ఈ పాపను ఇలా వదిలేసి ఎవరు వెళ్లారు? అని చుట్టూ చూసింది. అక్కడ ఆ ముసలమ్మా ఇంకా ఆ పాప వారిద్దరు తప్పితే ఇంక అక్కడ ఎవ్వరు లేరు. ఆ పాపను అడిగితే ఏమీ మాట్లాడకుండా అలాగే ఏడుస్తూనే ఉంది. సరే ఏమైనా ఉంటే రేపు పొద్దున్న చూసుకుందాంలే" అని ఆ ముసలమ్మ ఆమెను తనతో ఇంటికి తీసుకెళ్లింది.
తనకు కాస్త భోజనం పెట్టి పడుకోబెట్టింది. పొద్దున్న లేచి ఆ పాపతో ఇలా అడిగింది. "ఎవరమ్మా నువ్వు? అంత రాత్రిపూట అక్కడ ఏమి చేస్తున్నావు?, ఎక్కడనుంచి వచ్చావు" అని అడిగింది.
అప్పుడు ఆ పాప ఏడుస్తూ చెప్పడం మొదలుపెట్టింది.
మా అమ్మ నాన్న చనిపోయారు, నాకు ఎవరూ లేరు అనింది. అప్పుడు ముసలమ్మకు చాలా జాలి వేసి, కొంచం సేపు అలోచించింది. ఆ ముసలమ్మ కూడా ఒకతే ఉండడంతో అయ్యో ఏడవకమ్మా, నీ ఏడుపు నేను చూడలేకపోతున్నాను. ఎలాగూ నాకు కూడా తోడు ఎవరూ లేరు అందువల్ల నువ్వూ నాతోనే ఉంటావా" అని అడిగింది. దాంతో ఆ పాప "సరే" అంటూ తల ఊపింది.
దేవుడు నాకోసం పంపిన పిల్లవే నువ్వు అనుకుంటూ, ఆ పాపకు “ధార్మిక” అని పేరు పెట్టి స్వంత బిడ్డకంటే ఎక్కువగా చూసుకుంది.
కాలం గడుస్తూ, ధార్మిక పెరుగుతున్న కొద్దీ, ఆమె గురించి కొన్ని విచిత్రమైన విషయాలు గ్రామస్తులకు కనిపించసాగాయి.
ఆమె ఎక్కడికి వెళ్లినా పూలు స్వయంగా వికసించేవి,
గాయపడిన పక్షులు ఆమె చేతుల్లో కాసేపు ఉండగానే మళ్లీ ప్రాణం పొందినట్టుగా ఎగిరిపోతుండేవి, ఆమె నవ్వితే…
బాధలో ఉన్న వాళ్లకూ తెలియని ఆనందం కలిగేది ముఖ్యంగా, ఆమెకు ప్రకృతితో ఒక అద్భుతమైన అనుబంధం ఉండేది.
అడవుల్లో తిరుగుతూ, పక్షులతో మాట్లాడినట్టుగా, జంతువులను అర్థం చేసుకున్నట్టుగా, వాటి బాధలు తెలుసుకున్నట్టుగా ఉండేది.
ఒకసారి ఒక రైతు పంటలు ఎండిపోయి బాధ పడుతుంటే, ధార్మిక అతని భాదను చూసి... బాధ పడకు తాతయ్య మళ్ళీ పొలాన్ని పండిద్దాం "నేనూ నీకు సహాయం చేస్తాను" అంటూ కాస్త పని చేసి తను ఇంటికి వెళ్ళింది. రెండు మూడు రోజులకే ఆ పొలం మళ్లీ పచ్చగా మారింది. ఆ రైతుకే ఆశ్చర్యం వేసింది. ఆమె చేతిలో ఏదో దివ్యశక్తి ఉందేమో అని అనుకున్నాడు.
ఇలా గ్రామంలో ఎవరికైనా కష్టం వస్తే, ధార్మిక అందరికి సహాయం చేసేది. గ్రామ పెద్దలు అప్పుడప్పుడు ఇలా అనుకునేవారు. “ఈ అమ్మాయి సాధారణం కాదు. తన హస్తవాసి చాలా మంచిది” అని ధార్మిక మాత్రం ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. తన నవ్వు అందరిని ఆకట్టుకొనేలా ఉండేది. గ్రామస్థులకు తన ముఖం చూస్తే ఎదో తెలియని సంతోషంగా అనిపించేది. అలా అందరూ తనను చాలా ఇష్టపడేవారు.
రోజులు గడుస్తున్న కొద్దీ ధార్మికలో కొన్ని మార్పులు గ్రామస్తులకు గమనించబడ్డాయి. ముందులాగానే నవ్వుతూ, అందరితో కలిసిమెలసి ఉండేది. కానీ కొన్ని సార్లు ఆమె కళ్లలో ఒక విచిత్రమైన ఆలోచన, లోతైన బాధ కనిపించింది.
ఒక సాయంత్రం, సూర్యాస్తమయం అవుతోంది. ఆకాశం నారింజ రంగులో మెరుస్తోంది, గ్రామం నిశ్శబ్దంగా మారుతోంది. అప్పుడు ధార్మిక ఒంటరిగా గ్రామం చివర ఉన్న అడవివైపు నడవడం మొదలుపెట్టింది.
అది గమనించిన చిన్న పిల్లలు అడిగారు: “ధార్మిక అక్కా… ఎక్కడికి వెళ్తున్నావ్?”
ఆమె కాస్త చిరునవ్వు నవ్వుతూ: "కొంచెం పని ఉంది... త్వరలో వస్తాను…" అని చెప్పింది. కానీ ఆమె కళ్లలో ఏదో తెలియని రహస్యం కనిపించింది. ఆ మాటలో ఏదో ప్రత్యేకమైన భావం ఉంది… కానీ ఎవరికీ అర్థం కాలేదు.
ఆ రాత్రి… గాలి బలంగా వీస్తోంది, ఆకాశంలో మబ్బులు గుమిగూడుతున్నాయి, గ్రామస్తులలో కొందరు చెబుతారు ఆ రాత్రి అడవిలోనుంచి ఒక వెలుగు కనిపించిందని. ఆ వెలుగు నేరుగా కొండపై ఉన్న గుహ వైపు వెళ్లిందని.
మరుసటి ఉదయం ధార్మిక ఇంటికి రాలేదు. మొదట అందరూ “ఏదైనా పని ఉండి ఆలస్యమై ఉంటుంది” అని అనుకున్నారు. ఆ రోజు నుంచి ధార్మికను ఎవరూ చూడలేదు. కానీ కొందరు ఆమె అడవిలోకి వెళ్లినట్టు చెప్పుకున్నారు. ఆమె కనిపించలేదని గ్రామం మొత్తం కలవరపడింది. కొందరు అడవిలో వెతికారు, కొందరు సమీప గ్రామాలకు వెళ్లి అడిగారు. కొందరు గుహ దగ్గరికి కూడా వెళ్లారు. ఎక్కడా… ధార్మిక జాడ కనిపించలేదు.
ఆమెను పెంచిన ముసలమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా అనుకుంది: “నాకు అప్పుడే అనిపించింది… ఈ అమ్మాయి సాధారణం కాదని, దేవుడు ఇచ్చినవాళ్లను దేవుడే తీసుకుపోతాడేమో” అని. రోజులు గడుస్తూ… మొదట అందరూ ఆమె గురించి మాట్లాడుకున్నారు, తర్వాత మెల్లగా ఆమె జ్ఞాపకం కథలలో మాత్రమే మిగిలిపోయింది.
అయినా… కొన్ని రాత్రుల్లో గ్రామం చుట్టూ ఒక మృదువైన గాలి వీచినప్పుడు, పూలు తమంతట తామే వికసించినప్పుడు, “ఇది ధార్మికే కావచ్చు…” అని కొందరికి అనిపించేది. కానీ రోజులు గడుస్తూ ధార్మిక కనిపించకపోవడంతో కొద్ది కొద్దిగా తనని మరిచిపోయారు.
ఒకసారి గ్రామానికి భారీ ఎండబారుడు వచ్చింది. బావులు ఎండిపోయాయి, పంటలు వాడిపోయాయి. ఇంకా తెలియని జబ్బు ఒకటి గ్రామం మొత్తం వ్యాపించింది. గ్రామస్తులు ఎంతో ఆందోళనచెందారు. ఎప్పుడూ వెళ్ళని గ్రామ ప్రజలంతా, కొండపైన గుహలో ఉన్న తమ గ్రామ దేవతను వేడుకుందాం అని అక్కడికి వెళ్లారు. అక్కడ ఎవ్వరూ లేరు, భయంకరమైన చీకటి, గాలి, గుహలోకి వెళ్ళడానికి భయం. గ్రామం కోసం ప్రజలు మాకు ఏమైనా పరవాలేదు అంటూ ధైర్యం చేసి లోపలికి వెళ్లే సమయానికి, అక్కడ ధార్మిక లోపలికి వెళ్లడం చూసారు.
ధార్మిక ఏంటి ఇక్కడ.. అనుకుంటూ గ్రామ ప్రజలు తన వెంటే వెళ్లారు. ధార్మిక అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. పక్కకు తిరిగి చూస్తే ప్రజలకు గ్రామ దేవత కనిపించింది.
అందరూ గ్రామదేవతతో వారి కష్టాలు, కన్నీళ్లు చెప్పుకుంటూ, ఇక ఏమైనా మా గ్రామ ప్రజలకు నువ్వే దిక్కు తల్లి అంటూ వేడుకుని అక్కడినుండి బయలుదేరారు. వెళుతూ వెళుతూ, అయ్యో తల్లికి నైవేద్యం పెట్టడం మరిచిపోయాము, అని వెనుకకు తిరిగారు, అక్కడే ఒక వింత జరగడం చూసారు. అందరూ అలాగే నిశ్యబ్దంగా చూస్తూ ఉండిపోయారు! గ్రామ దేవత క్రమంగా ధార్మిక రూపంలోకి మారడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు! ఐతే ఇన్ని రోజులు మనతో ఉన్న ధార్మిక ఎవరో కాదు, మా ఊరిని కాపాడటానికి వచ్చిన మన గ్రామ దేవతా? అంటూ వెంటనే తన కాళ్ళ మీదకు పడి, "తల్లి నీ గ్రామ ప్రజలు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. నీవూ మాతో రావాలి, నీవే మాకు దిక్కు తల్లి, మమ్మల్ని కాపాడాలి" అంటూ ప్రధేయపడ్డారు.
ప్రజల కష్టాలను విన్న గ్రామ దేవత ఐనా ధార్మిక తన శక్తులతో మేఘాలను ఆహ్వానించింది. కొద్దిసేపటికి ఆకాశం మబ్బులతో నిండిపోయింది. గాలి చల్లబడింది. వెంటనే భారీ వర్షం కురిసింది. ఆ వర్షంలో తడిసిన గ్రామ ప్రజల జబ్బులు కూడా మాయం అయ్యింది.
ఆ రోజు నుంచి గ్రామ ప్రజలు ధార్మికను దేవతగా పూజించసాగారు. ఇప్పటికీ ఆ గ్రామంలో వర్షం పడిన, పూలు వికసించిన ప్రతిసారి... ‘ధార్మిక అమ్మ తిరిగి వచ్చింది…’ అని నమ్ముతారు.
Comments
Post a Comment